
తిరుపతి :- నాయుడుపేట మండలంలోని జువ్వలపాలెం పంచాయతీ కారుమంచి వారి కండ్రిగ గ్రామ పంట పొలాల్లో మంగళవారం సాయంత్రం అకాల వర్షం కారణంగా పిడుగు పడడంతో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. కారుమంచివారి కండ్రిగ గ్రామ పొలాల్లో యువకులు క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడింది.దీనితో క్రికెట్ ఆడుతున్న కారుమంచివారి కండ్రిగ గ్రామానికి చెందిన తొప్పాని రవికుమార్ తనయుడు యశ్వంత్ (22 ) అపస్మారక స్థితిలో చేరుకున్నాడు.వెంటనే అతనిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.మృతి చెందిన యశ్వంత్ మెకానికల్ డిప్లమా పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ క్రికెట్ ఆడుతుండగా పిడుగుపాటు రూపంలో మృత్యువు కబళించింది.విగతజీవిగా ఉన్న యశ్వంతను చూసిన అతని తల్లిదండ్రులు రోదించడంతో పలువురు కంటతడి పెట్టుకున్నారు.యశ్వంత్ మరణించడంతో కారుమంచి వారి కండ్రిక గ్రామం మూగబోయింది.చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో అతని తల్లిదండ్రులు ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.కాగా అదే సమయంలో పట్టణంలోని ఎల్ ఏ సాగరం ప్రభుత్వ పాఠశాల పక్కన కొబ్బరి చెట్టుపై పిడుగు పడంతో కొబ్బరి చెట్టు దగ్ధమైంది.

