
ధాన్యం కొనుగోళ్లలో భారీ దోపిడీ..బస్తాకు రూ.60 వెనక్కి తీసుకోవడం దారుణం
అన్నం పెట్టే రైతుపై ‘రామకృష్ణారెడ్డి టాక్స్’..మాజీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు
డీజిల్,ఎరువుల కొరతతో రైతులను ఇబ్బంది పెట్టడమేనా ప్రభుత్వ లక్ష్యం?
రైతుల ఖాతాల నుంచి డబ్బులు వెనక్కి వసూలు చేయడంపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం…
అనపర్తి :- అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేడాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.నియోజకవర్గ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. గతంలో యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ప్రభుత్వం డీజిల్ను అమరావతిలోని కాంట్రాక్టర్లకు తరలించడం వల్లే స్థానికంగా కొరత ఏర్పడి కోత మిషన్ల ఖర్చులు పెరిగాయని ఆరోపించారు. ప్రకృతి సహకరించి, ఈ ఏడాది మంచి పంట పండినప్పటికీ, ధాన్యం కొనుగోళ్లలో భారీ దోపిడీ జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంఆర్ ద్వారా ధాన్యానికి రావాల్సిన ధరలో కోతలు విధిస్తూ, రైతు ఖాతాలో జమ అయిన సొమ్ము నుండి మళ్లీ బస్తాకు 50 నుండి 60 రూపాయల వరకు వెనక్కి వసూలు చేస్తున్నారని, ఇది ముమ్మాటికీ “ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వేస్తున్న ట్యాక్స్” అని సూర్యనారాయణ రెడ్డి విమర్శించారు. ఒకవేళ ఈ వసూళ్లతో ఎమ్మెల్యేకు సంబంధం లేకపోతే, వెంటనే ఆ డబ్బును రైతులకు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. మిల్లర్లతో లాలూచీ పడి గతంలోనూ అవినీతికి పాల్పడ్డారని, ఇప్పుడు మళ్లీ అన్నం పెట్టే రైతు దగ్గర కక్కుర్తి పడటం సిగ్గుచేటని మండిపడ్డారు.రాబోయే పంట కాలానికైనా ఎరువులను ముందుగానే సిద్ధం చేసి గతంలో మాదిరిగా రైతులు క్యూలో నిలబడే పరిస్థితి రాకుండా చూడాలని సూచించారు…



