
గోల్డెన్ అవర్ లో స్పందిస్తే ప్రాణాపాయం నుంచి రక్షణ
సహాయం చేసిన ‘రహ-వీర్’లకు రూ.25,000 నగదు బహుమతి.
జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా…
అనకాపల్లి ప్రతినిధి :- రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం-రాహత్’ పథకం ఒక గొప్ప వరమని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పేర్కొన్నారు.గోల్డెన్ అవర్ ప్రాణాలకు సంజీవని ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలను (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమైన సమయంగా ఎస్పీ అభివర్ణించారు.”ఈ సమయంలో బాధితుడికి సరైన వైద్యం అందితే ప్రాణాలు నిలిచే అవకాశం 90 శాతం ఎక్కువగా ఉంటుంది.ప్రమాదం జరిగిన వెంటనే 100 లేదా 112 నంబర్కు సమాచారం అందించాలి.అలాగే 108 అంబులెన్స్ ద్వారా బాధితులను తక్షణమే ఆసుపత్రికి తరలించాలి” అని ఆయన సూచించారు.’పీఎం-రాహత్’ పథకం – సమగ్ర వివరాలు.ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదానికి గురైన ఎవరైనా సరే (పాదచారులు,వాహనదారులు,లేదా విదేశీయులు) గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో గరిష్టంగా 1.5 లక్షల రూపాయలు వరకు ఉచిత నగదు రహిత చికిత్స పొందే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన రోజు నుండి వరుసగా ఏడు రోజుల పాటు ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా వైద్య సేవలు అందుతాయి. ఈ ప్రయోజనాన్ని పొందాలంటే ప్రమాదం జరిగిన 24 గంటల లోపు బాధితుడిని ఆసుపత్రిలో చేర్చాల్సి ఉంటుంది.ముఖ్యంగా,రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటును తగ్గించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం,పేద-ధనిక అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ అత్యవసర సమయంలో ప్రాణరక్షణ కల్పిస్తుంది. సహాయం చేసే వారికి ‘రక్ష’ – రూ.25,000 బహుమతి ప్రమాద బాధితులను కాపాడే ‘గుడ్ సమారిటన్ (రహ-వీర్)’లకు ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తోందని ఎస్పీ స్పష్టం చేశారు.
నగదు పురస్కారం…
బాధితులను సమయానికి ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం రూ.25,000 రూపాయలు నగదు బహుమతి అందజేస్తుంది.వేధింపులు ఉండవు. సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేయడం లేదా పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.త్వరితగతిన ధృవీకరణ.సమాచారం అందిన 24 గంటల్లోనే పోలీసు శాఖ ప్రమాద ధృవీకరణ పూర్తి చేసి,వైద్య ఆరోగ్య మరియు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటుంది.”మానవత్వంతో స్పందించండి..ఒక ప్రాణాన్ని నిలబెట్టండి.రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు భయం వీడి సహాయం చేయండి.పీఎం-రాహత్ పథకం పట్ల ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలన్నారు…



