
మాకవరపాలెం హెచ్ పి గ్యాస్ కేంద్రం వద్ద లబ్ధిదారుల ఆందోళన…
మాకవరపాలెం మండల కేంద్రంలోని హెచ్ పి గ్యాస్ పంపిణీ కేంద్రం వద్ద శనివారం లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.ఉదయం 10 గంటల నుంచే గ్యాస్ సిలిండర్ల కోసం వచ్చిన ప్రజలు రాత్రి 8 గంటలు దాటినా సరైన పంపిణీ జరగకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.చిన్నపిల్లలతో, వృద్ధులతో వచ్చిన మహిళలు గంటల తరబడి ఎండలో వేచి ఉండాల్సి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.గ్యాస్ సరఫరాలో నిర్లక్ష్యం,సరైన సమాచారం లేకపోవడం,సిబ్బంది తీరుతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.రోజువారీ పనులు వదిలేసుకుని వచ్చినా సిలిండర్లు అందక నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రతి నెలా ఇదే పరిస్థితి.గ్యాస్ కోసం రోజంతా వేచి చూడాల్సి వస్తోంది.అధికారులు స్పందించకపోతే మా కష్టాలు ఎప్పుడు తీరుతాయి?” అంటూ మహిళలు ప్రశ్నించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ బొంతు రమణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.ప్రజలకు అత్యవసరమైన గ్యాస్ సరఫరాలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.గ్రామీణ ప్రాంత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
“ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలను గ్యాస్ కోసం క్యూలలో నిలబెట్టడం దారుణమన్నారు.మహిళలు,వృద్ధులు పడుతున్న ఇబ్బందులు అధికారులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.వెంటనే ప్రభుత్వం స్పందించి గ్యాస్ సరఫరాను సక్రమంగా నిర్వహించాలని,ప్రజలకు ఇలాంటి కష్టాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బొంతు రమణ డిమాండ్ చేశారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్యాస్ పంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలని,లబ్ధిదారులకు సమయానికి గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు…



